హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు మానేరురివర్ ఫ్రంట్. రూ.410 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇదివరకే అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టుపై మంత్రి గంగుల ప్రత్యేక దృష్టి సారించి, పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జలసౌధలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ఇరిగేషన్, టూరిజం, ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు పదికిలోమీటర్ల మేర ప్రతిపాదిత ప్రాజెక్టులో మొదటి విడతగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరుగనున్నాయి. వీటికి సంబంధించిన వివిధ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, , చిల్డ్రన్ పార్క్స్, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగులు, ఇంకా స్పోర్ట్ ఎన్ క్లేవ్లో భాగంగా టెన్నిస్, వాలీబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాకులతో దక్షిణ భారతానికే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ ప్రతినిదులు, ఇతర రాష్ట్ర, జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.