జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధి పొట్టిగుట్ట తండాలో గల వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలంబ్రాలు సమర్పించారు. కొండమీద ఉన్న స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహ స్వామి తమ ఇలవేల్పు అన్నారు. స్వామి వారి సన్నిధిలో ఇలా తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు.
ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్న సీఎం కెసీఆర్, వారి కుటుంబం చల్లగా నాలుగు కాలాల పాటు ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం పొట్టిగుట్ట తండాలో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. స్వచ్ఛమైన, శుద్ధి చేసిన మంచినీరు ప్రజలకు అందుతాయని, ఈ నీటితో ఆరోగ్యాలు బాగుంటాయని మంత్రి చెప్పారు.