వరంగల్ : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో ప్రతి అభ్యర్థి సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను మంత్రి దయాకర్ రావు ఇవాళ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు వాళ్ల నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టి ఈ పని చేస్తున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందన్నారు. ప్రయివేటు రంగంలోనూ 17 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. కోచింగ్ తీసుకుంటున్న మీరంతా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండి, పట్టుదలతో చదివి ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని చెప్పారు. మీకు ఉద్యోగం వస్తే మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని పేర్కొన్నారు. అయితే పరీక్ష రాసిన వారంతా సెలెక్ట్ కాకపోవచ్చు.. కానీ ఈ నాలెడ్జ్ ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని పక్షంలో ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని దయాకర్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్పర్సన్ వాణీ దేవి, స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్, కార్పొరేటర్లు దిడ్డి కుమార స్వామి, గుండెటి నరేందర్, మసూద్, రమేష్ బాబు, సురేష్ జోషి, మస్కుమల్ల అరుణ, కావేటి కవిత, పోషాల పద్మ, వెల్పుకొండ సువర్ణ, చింతాకుల అనిల్, వోని భాస్కర్, వోని స్వర్ణ లత, వస్కుల బాబు, మరుపల్లి రావు, బైరబోయిన దామోదర్, సోమిషెట్టి ప్రవీణ్, ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ సత్యనారాయణ చారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.