NAREGA | నర్సంపేట : ఉపాధి హామీ పథకంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుంచి ప్రారంభించారు. మొదటి పోస్ట్ కార్డును కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు. రెండో పోస్ట్ కార్డును నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) పంపించారు. ఈ సందర్భంగా ఆ పోస్ట్ కార్డుపై ఈ విధంగా రాశారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోంది. గత ఏడాది రూ. 30 వేల కోట్ల బడ్జెట్ కోత విధించారు. దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయి. వ్యవసాయ కూలీకి రోజుకు రూ. 257 ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి రూ. వందకు మించడం లేదు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేదు. కనీస వేతన చట్ట ప్రకారం 8 గంటలు పని చేసిన కూలీకి రూ. 480 ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ గిట్టడం లేదు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారు. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. సన్న, చిన్న కారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారు. కాబట్టి వ్యవసాయం అనుసంధానం చేయటం వల్ల రైతులకు కూలి గిట్టుబాటు అవుతుంది. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పనిదినాలు కల్పించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏ పి ఓ ల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఆ పోస్టు కార్డులో రాశారు.