వరంగల్: రక్త దానం మహాదానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒక వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడే అద్భుత అవకాశం రక్తదానం వల్ల లభిస్తుందని చెప్పారు. రక్తదానం వంటి బృహత్తర కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానం పట్ల ప్రజలకున్న అపోహలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ప్రాణహాని ఉండదని చెప్పారు. మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తం ఉత్పత్తి అవుతుందని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చని వెల్లడించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రాముఖ్యాన్ని దశదిశలా చాటాలని సూచించారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరాలకు అందించాలన్నారు. వచ్చే తరాలకు శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం విలువలు తెలియజేయాలని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరు అమృత్ మహోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు రాజయ్య, రమేశ్, GWMC మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, జనగామ, వరంగల్ జిల్లాల జెడ్పి చైర్మన్లు, ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల, వైద్య, వివిధ శాఖల అధికారులు, వైద్యులు, సిబ్బంది, రక్త దాతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.