హైదరాబాద్ :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకరకంగా , ఎన్నికల తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం గ్యాస్ సిలిండర్(gas sylender ) ధరలను పెంచి మహిళలను మోసం చేసిందని అన్నారు.
పేదలను కొట్టి పెద్దలకు వేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం బీజేపీకి పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలవుతోందని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించకపోతే ప్రజలు మోదీని గద్దె దించడం ఖాయమని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపారు.ధాన్యం(Paddy) కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
తెలంగాణలో రైతులు బాయిల్డ్ రైస్ పండిస్తుండగా కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే కొంటామని మొండికేస్తుందని ఆరోపించారు.తెలంగాణ రైతాంగం యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదని పేర్కొన్నారు.ఎన్నికల ముందు 50 రూపాయలు తగ్గించి, ఎన్నికలు ముగిసిన వెంటనే వందల రూపాయలు కేంద్రం పెంచుతుందని అన్నారు.