హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): వైద్యసేవల్లో రాష్ర్టానికి ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చేందుకు ఇక్కడి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కొనియాడారు. రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిమ్స్ దవాఖానల వైద్యులు ఆ మేరకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిమ్స్ దవాఖానలో రూ.12 కోట్లతో నిర్మించిన డీఎస్ఏ ల్యాబ్, రూ.5 కోట్లతో నిర్మించిన సీపీఆర్ అడ్వాన్స్డ్ హై-ఫైడ్లిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్ లాబ్లను శుక్రవారం ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా, జెన్నిఫర్ లార్సన్-యూఎస్ కౌన్సిల్ జనరల్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిమ్స్ దవాఖానకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నదని, దానిని కొనసాగేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే 20 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిపారు. అంతకు ముందు మంత్రి నిమ్స్ దవాఖానలోని అన్ని ప్రధాన విభాగాల్లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిమ్స్లో 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాప్నర్సులకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగదిపతి సాయిసతీశ్, కార్డియోవ్యాస్కులర్ నిపుణులు అమరేశ్, పల్మనాలజీ నిపుణులు పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.