అధికార కాంగ్రెస్ అక్రమాల డొంక కదులుతున్నది. ప్రభుత్వ పెద్దలే నిబంధలను తుంగలో తొక్కి.. భూ దందాల్లో తలమునకలవడం దుమారం రేపుతున్నది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల పర్వం అంతా ఇంతా కాదు. ఎక్కడ జాగ కనబడినా ముందుగా మంత్రిగారి కంపెనీ దిగిపోవడం! ఆనక భూముల్ని ఆక్రమించడం! అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ రికార్డులనే మార్చేయడం! పక్కా ప్రణాళికతో నడిపిస్తున్న వ్యవహారమిది. అమాత్యుడి అక్రమాలకు ముఖ్యనేత వంతపాడుతున్నది వాటాల వల్లే అనేది సుస్పష్టం.
హెచ్ఎండీఏ వేలం వేయాల్సిన 17 ఎకరాలను మార్గదర్శకాలేవీ లేకుండా సీఎం బంధువులకు క్రషర్ కోసం ధారాదత్తం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మంత్రి పొంగులేటి కుటుంబం కొత్వాల్గూడలో క్రషర్ ముసుగులో అక్రమాలకు తెరలేపింది. అటు పురపాలక శాఖ, ఇటు రెవెన్యూ రెండూ ఉల్లం‘గనుల’కు ఊతమిచ్చే విభాగాలు మారిపోయాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఒకటి! ప్రభుత్వంలో తాను నంబర్ టూ అని చెప్పుకొనే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మరొకటి! ఆ రెండు శాఖల బాధ్యులూ ఉల్లం‘గనులే’ అని చాటుకున్నారు. పురపాలక శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ వేలం వేయాల్సిన రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమిని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా బంధువులకు ధారాదత్తం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తనను కోసినా రూపాయి లేదంటూ చేతులెత్తేసిన ముఖ్యమంత్రి.. ఎకరా రూ.180 కోట్ల దాకా పలికే చోట వేలం వేసేందుకు ప్లాట్లుగా విభజించిన 17 ఎకరాల భూమిని క్రషర్ కోసం కేటాయించడం గమనార్హం. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన కుటుంబం ఏకంగా పాత అసైనీలను తెరపైకి తెచ్చి ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తుండటం రాష్ట్రంలో సర్కార్ పెద్దల భూ పందేరం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచింది.
కోకాపేట నియోపొలిస్.. ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్నటిదాకా దేశ రియల్ ఎస్టేట్ రంగంలోని వేలం ప్రక్రియలో రికారు ్డస్థాయి ధరలు నమోదు చేసిన ప్రాంతం. ఇలాంటి ప్రభుత్వ లే అవుట్లోనే సర్కార్ పెద్ద భూ పందేరానికి తెరలేపారు. వాస్తవానికి కేసీఆర్ హయాంలో కోకాపేట సర్వేనంబర్ 239, 240ల్లో సుమారు 400 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ చేశారు. హెచ్ఎండీఏ అందులోని ప్లాట్లకు వేలం నిర్వహిస్తే కార్పొరేట్ కంపెనీలు పోటీ పడి మరీ నివాస, వాణిజ్య సముదాయాలు, ఆఫీస్ స్పేస్ కోసం రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశాయి.
ముఖ్యంగా లే అవుట్లో భాగంగా ప్రజావసరాల కోసం (హోటళ్లు, క్రీడా మైదానాలు, వినోద కేంద్రాలు, థియేటర్లు, బస్బే, ఇతరత్రా) 44 ఎకరాలను కేటాయించారు. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావసరాలకు కేటాయించిన ఆ భూమిని సైతం ప్లాట్లుగా మార్చి వేలం వేశారు. అందులోనే రికార్డుస్థాయిలో ఎకరా సుమారు రూ.176 కోట్లకు పైగా ధర పలికి ఆ వేలంలో రూ.3,863 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఓవైపు హైదరాబాద్లో కాలుష్య తీవ్రత తగ్గించేందుకు చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామంటూ హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం మరోవైపు లంగ్ స్పేస్ కోసం కేటాయించిన భూముల్ని ప్లాట్లుగా చేసి వేలం వేసి అమ్మింది.
లంగ్ స్పేస్ను సైతం ఆదాయం కోసం వేలం వేసి అమ్మిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వేలం కోసం కేటాయించిన జే నుంచి ఆర్ ప్లాట్లను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. వాస్తవానికి ఈ లే అవుట్లో భూముల్ని కొనుగోలు చేసిన బడా కార్పొరేట్ సంస్థలన్నీ తమ నిర్మాణాల కోసం వాళ్లే రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం భాగ్యలక్ష్మీ మైన్స్ అండ్ మినరల్స్కు ఈ ప్లాట్లు కేటాయించడం గమనార్హం. వాస్తవానికి ఆ కంపెనీ పదెకరాల భూమిలో ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే హెచ్ఎండీఏ దానికి అదనంగా ఏడెకరాలు కలిపి 17 ఎకరాలు కేటాయించింది. అంటే ఎకరా రూ.180 కోట్ల వరకు ధర పలికే ఇక్కడ దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు.
ఈ మైనింగ్ కంపెనీ స్వయానా సీఎం బావమరిదికి చెందిన కుటుంబానిదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే పురపాలక శాఖను సీఎం స్వయంగా నిర్వహిస్తున్నారంటే ఆయన పరిధిలోని భూముల కేటాయింపు జరగాలంటే ఇతరులెవరికీ సాధ్యం కాదనేది బహిరంగ రహస్యం. ఓవైపు హైడ్రా పేరిట ప్రైవేట్ అనధికారిక వెంచర్లలో పార్కులు, ఓపెన్ స్పేస్ల కోసం కేటాయించిన స్థలాలు అంటూ నిత్యం నిర్మాణాలను కూల్చివేస్తున్న ఈ ప్రభుత్వం అధికారికంగా చేసిన లే అవుట్లో మాత్రం లంగ్స్పేస్ కోసం కేటాయించిన భూముల్ని మాత్రం ప్లాట్లుగా చేసి అమ్ముకున్నది. వేలం కోసం వేసిన భూముల్ని తమ అనుయాయులకు ధారాదత్తం చేసింది.
వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములతో సర్కార్ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా ఆ బడా సంస్థకు కట్టబెట్టిన హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు.. ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు కోరుతూ ‘నమస్తే తెలంగాణ’ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీవత్సను వివరణ కోరింది. కానీ ఆ అధికారి మాత్రం కోకాపేట వెంచర్లో లీజు వ్యవహారాలే జరుగలేదని తెలిపారు. వివరణ కోరిన ఐదు రోజుల వరకు సమాచారం ఇవ్వకుండానే బుకాయించారు. ఇక ఎస్టేట్ విభాగానికి ప్రాతినిధ్యం వహించే అధికారులైతే కనీసం లీజు వ్యవహారంపై స్పందించకుండా విషయాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు.
ఇలా సర్కార్, హెచ్ఎండీఏ యంత్రాం గం చేసిన తప్పిదం బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. ఇక భాగ్యలక్ష్మీ మైనింగ్ అండ్ మినరల్స్ సంస్థకు చెందిన యజమానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే కోకాపేట భూ ముల లీజు వ్యవహారం జరిగిందనీ హెచ్ఎండీఏ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కానీ సంబంధిత అధికారులు భూముల లీజు వ్యవహారంపై సమాచారాన్ని దాచిపెడుతూనే ఉన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన విలువైన భూముల్ని తమ అనుయాయులకు కేటాయించిన ప్రభుత్వం చివరికి నిబంధనలను సైతం తుంగలో తొక్కింది. అసలు హెచ్ఎండీఏ ఏ ప్రాతిపదికన భాగ్యలక్ష్మీ మైన్స్ అండ్ మినరల్స్కు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన అధికారిక లే అవుట్ నుంచి 17 ఎకరాల భూమి కేటాయించిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీనికి సంబంధించిన వివరాల్ని చెప్పేందుకు సైతం హెచ్ఎండీఏ అధికారులు సమ్మతించకపోగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టినా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో గనుల శాఖ నుంచి ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం మేరకు హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ ప్రొసీడింగ్తో 17 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ మైనింగ్ కంపెనీకి కేటాయించడం విడ్డూరంగా ఉన్నదని సీనియర్ రిటైర్డ్ అధికారులు అంటున్నారు.

కొత్వాల్గూడ: ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూముల్లో లీజు ఒప్పందాలు నిషేధించిన నిబంధన

కోకాపేటలో 17 ఎకరాల భూమిని చదును చేయడానికి హెచ్ఎండీఏ అనుమతించిన పత్రం