హైదరాబాద్ : శాసనమండలి ప్రొటెం చైర్మన్గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ హసన్ జాఫ్రీ నియామకం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి పూర్తిస్థాయి చైర్మన్ ఎన్నికయ్యే వరకు అమీనుల్ జాఫ్రీ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
నేటి వరకు ప్రొటెం చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ నెలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ల ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో ప్రోటెం చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించిన విషయం విదితమే.
అమీనుల్ హసన్ జాఫ్రీ రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు జర్నలిస్టుగా సేవలందించారు. 2011లో ఎంఐఎం పార్టీ తరపున శాసనమండలికి జాఫ్రీ ఎన్నికయ్యారు. 2017, ఫిబ్రవరిలోనూ ఆయన మళ్లీ మండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఆయన కొనసాగడం ఇది మూడోసారి. సాధారణ చైర్మన్, స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ప్రొటెం చైర్మన్కు ఉంటాయి. ఎస్కార్ట్, ప్రొటోకాల్, జీతభత్యాలు, బంగ్లా సౌకర్యాలు కూడా ఉంటాయి.