పెద్దవూర, జూన్ 26 : నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో చాళుక్యులు, రాష్ట్రకూటులు, విజయనగర కాలం నాటి శిల్పాలను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పెద్దవూర గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆదివారం ఆయన స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలోని శిల్పాలను పరిశీలించారు. శివలింగం, నంది, సూర్య, వీరభద్ర, గణపతి విగ్రహాలు క్రీ.శ. 8వ శతాబ్దం నాటి చాళుక్యుల కాలం నాటివని ఆయన పేర్కొన్నారు. శివలింగం భూమిలో కూరుకుపోయిందని, తలపై కిరీటం లేని గణపతి, కూర్చొని ఉన్న వీరభద్ర శిల్పాలు గోడలో బిగించినట్టు ఉన్నాయని, వాటిని వెలికితీసి అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని స్థానికులకు సూచించారు. ఆంజనేయ స్వామి ఆలయ అర్ధ మండపం స్తంభాలు క్రీ.శ. 9వ శతాబ్దం నాటి రాష్ట్రకూటుల వాస్తు కళకు అద్దం పడుతున్నాయన్నారు.