Congress | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో ఇబ్బడిముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు, పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులకు, పాత నాయకులు, శ్రేణులకు మధ్య సమన్వయ లోపంవల్ల ఎన్నికల్లో నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి, పార్టీ వ్యూహం, అభ్యర్థుల విజయవకాశాలను విశ్లేషిస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ 30 పేజీల నివేదికను పీసీసీ నాయకత్వానికి అందజేసింది. దీనిని అధిష్ఠానానికి పంపనున్నట్టు దీపాదాస్ తెలిపారు. ఇది రేవంత్రెడ్డిపై పార్టీలో విస్తృత చర్చకు దారితీసింది.
ఈ ఎన్నికల్లో నాయకుల మధ్య సమన్వయం లోపంపై మేనేజ్మెంట్ కమిటీ చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ స్థానాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ నాలుగు స్థానాల నుంచి పోటీచేసిన అభ్యర్థులు షెడ్యూల్ వెలువడిన తర్వాత చేరినవారే. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య సీఎం రేవంత్రెడ్డి ప్రోదల్బంతో పార్టీమారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నవారే. అధిష్ఠానాన్ని ఒప్పించి వీరికి టికెట్లు ఇప్పించింది కూడా ఆయనే. ఈ పారాచ్యూట్ నాయకులను అభ్యర్థులుగా బరిలోకి దింపడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ చర్యను సీనియర్ నాయకులు హనుమంతరావు, నిరంజన్, జడ్సన్ బాహాటంగానే వ్యతిరేకించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ బక్క జడ్సన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీసీసీ ముఖ్యనేతలతో నేరుగా ఒకసారి, జూమ్ మీటింగ్లో మరొకసారి సమీక్షించిన సందర్భంగా ఎన్నికల ఫలితాలను బట్టే భవిష్యత్లో పార్టీలో, ప్రభుత్వంలో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టు జరిగితే కొన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పిదానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డినే కారణమని, మరి అక్కడ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తే దానిపై అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందోనని ముఖ్యనేతలుఆసక్తిగా చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉన్నదన్నది వీరి వాదన. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నివేదికను అధిష్ఠానం సీరియస్గా తీసుకుంటుందా? లేక చెత్తబుట్టలో పడేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.
పార్టీలో టికెట్ ఆశించిన వారిని పక్కనపెట్టి పారాచ్యూట్ నాయకులను బరిలోకి దింపిన ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైతే దానికి సీఎం రేవంత్రెడ్డినే బాధ్యతవహించాల్సి ఉంటుందన్నది పార్టీ వర్గాల వాదన. కాంగ్రెస్ విజయవకాశాలు తక్కువగా ఉన్న వాటిలో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలను ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ప్రత్యేకంగా పేర్కొంది. ఈ నియోజకవర్గాల అభ్యర్థులు ఎన్నికల ముందే పార్టీలో చేరడంతో కొత్త, పాత శ్రేణుల మధ్య సమన్వయం లోపించిందని కమిటీ గుర్తు చేసింది. ఇందుకు రేవంత్రెడ్డినే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ డైరెక్ట్గా చెప్పనప్పటికీ, ఆ తప్పిదాన్ని పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడిపైనే మోపింది.