మహబూబ్ నగర్ : రాష్ట్రంలో ఉపాధిలేక నాడు వలస వెల్లిన వారు నేడు తిరిగి వస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. ఒకప్పుడు వ్యవసాయం వల్లే అంతా బతికారని, తర్వాత వ్యవసాయంలో నష్టాలు రావడం, కరెంటు, నీళ్లు లేక రైతులు వ్యవసాయం వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంటు, సాగునీటి రాకతో వలసపోయిన రైతులు తిరిగివచ్చారని మంత్రి తెలిపారు.
వ్యవసాయ కూలీలు సైతం మంచి కూలీ పొందుతున్నారు. తాటిపర్తి గ్రామానికి సమీపంలోనే కరివెన రిజర్వాయర్ ఉందని.. దాన్ని అద్భుత పర్యాటక ప్రాంతం చేస్తామన్నారు. పర్యాటకులు సులభంగా చేరుకునేందుకు కరివెనకు మంచి రోడ్ వేస్తామని తెలిపారు. మంత్రులంతా సీమ లిఫ్టుకు వ్యతిరేకంగా ఏపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ప్రజలంతా సిద్ధం కావాలన్నారు.
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం తో నీరు పుష్కలంగా వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.