హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బడుల్లో చిన్నారులు తమ సమస్యను చెప్పుకొనేందుకు టీచర్లలో ఒకరిని మెంటార్గా నియమించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏదైనా ఆపద తలెత్తినా, వేధింపులు చోటుచేసుకొన్నా వెంటనే మెంటార్ టీచర్లకు చెప్పుకొనేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. బడుల్లో పిల్లల భద్రత, రక్షణకు పటిష్ఠ మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చాఆర్డీలో పలు వర్గాలతో సమావేశమైంది. ఈ సందర్భంగా నల్సార్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్, పోలీసుశాఖ, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించింది. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఐపీఎస్ అధికారి సుమతి పాల్గొన్నారు.
యాజమాన్యాలు బాధ్యత వహించాలి : డీజీపీ మహేందర్రెడ్డి
విద్యారంగంలో టెక్నాలజీపరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో పిల్లల్ని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పిల్లల భద్రత, రక్షణ ముఖ్యమని, ఈ విషయంలో యాజమాన్యాలు బాధ్యత వహించాలని సూచించారు. ఇందుకు వ్యవస్థీకృతమైన మార్గదర్శకాలను రూపొందించాలని డీజీపీ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు.