అతడి పేరు రాజు. కొవిడ్బారినపడ్డాడు. కానీ, లక్షణాలు లేవు. భయంతో ఓ కార్పొరేట్ దవాఖానకు వెళ్లాడు. అక్కడి వైద్యులు హాస్పిటల్లో చేరనక్కరలేదని, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని సూచించారు. అతను వినలేదు. హాస్పిటల్లో చేరాడు. ఇలా కొంతమంది అనవసర భయాలతో దవాఖానల్లో చేరి, రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు.
అతడి పేరు ప్రకాశ్. 15రోజుల క్రితంపాజిటివ్ వచ్చింది. స్వల్ప జ్వరం, బాడీ పెయిన్స్తో బాధపడ్డాడు. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాడు. ప్రత్యేక గదిలో ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుని కోలుకొన్నాడు. ఇలాంటివారు చాలామందే ఉన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు, సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండి, జాగ్రత్తలు పాటిస్తే కోలుకోవచ్చని చెబుతున్నారు. దీనికితగ్గట్టే.. చాలామంది ఇంట్లోనే క్వారంటైన్లో ఉండి కోలుకొంటున్నారు. వైద్యశాఖ సూచించిన జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటిస్తూ గండం గట్టెక్కుతున్నారు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ, సరైన నిద్ర, వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకొంటున్నారు. వీటితో తాజా కూరగాయలు, పండ్లు, డ్రైఫూట్స్, చికెన్ తదితర పోషకాహారం తీసుకొంటూ మహమ్మారిని జయిస్తున్నారు. నూటికి 70 మంది బాధితులు ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తూ కోలుకుంటున్నారని డాక్టర్ నవజన్కుమార్ పేర్కొన్నారు.
పాజిటివ్ థింకింగ్ ఉండాలి
కరోనా బాధితులు తమను ఇతరులతో పోల్చుకోవద్దు. వారిలాగే మనకూ సమస్యలు వస్తాయనే ఆందోళన వద్దు. ఇతరుల మరణాన్ని చూసి భయపడవద్దు. ఒక్కొక్కరి ఆరోగ్యం, వయసు, కొవిడ్ స్టేజీ వేరువేరుగా ఉంటుంది. ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైద్య పరీక్షల్లో తేలుతుంది. అనవసరంగా భయపడవద్దు. అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేవాటిని అన్వయించుకోవడం మంచిది కాదు.
-డాక్టర్ స్వాతి, కౌన్సెలింగ్ సైకాలజిస్టు, ఉస్మానియావర్సిటీ
ఇంట్లోనే కోలుకుంటున్నారు
ఇంట్లోనే జాగ్రత్తలు పాటించి, కరోనా నుంచి కోలుకొంటున్నవారు అధికంగానే ఉన్నారు. నెగెటివ్ థింకింగ్ వద్దు. నిర్లక్ష్యం పనికిరాదు. అనవసర భయాలతో రోగాన్ని రెట్టింపు చేసుకోవద్దు. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. మెడిటేషన్ చేయాలి. మోటివేషన్ ఉపన్యాసాలు వింటూ ఉండాలి.
-మోతుకూరి రాంచందర్, సైకాలజిస్టు