ములుగు, మార్చి 14(నమస్తేతెలంగాణ) ఎల్బీనగర్/సుల్తాన్బజార్: హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఒక ప్రైవేట్ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఒక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపించారు.
హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుపాక గ్రామానికి చెందిన సుంకర వెంకట సుబ్బారావు కుమార్తె సుంకర సాహితి (26) హైదరాబాద్లో ఎంబీఏ చదువుకొంటున్నది. కొద్దికాలంగా దిల్సుఖ్నగర్లోని ఒక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న చైతన్యపురి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఆత్మహత్యకు ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చిడెం మోహన్రావు కుమారుడు చిడెం హరీశ్ కారణమని బంధువులు ఆరోపించారు.
హరీశ్ తన తండ్రి అండ చూసుకుని సాహితిని వేధింపులు, బెదిరింపులకు గురిచేశాడని మృతురాలు తండ్రి, సోదరుడు విలపించారు. హరీశ్ వేధిస్తున్న విషయం తమకు రెండు రోజుల క్రితమే తెలిసిందని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీంటిపర్యంతమయ్యారు. సాహితిని వేధిస్తూ, బెదిరిస్తూ వాట్సప్లో వందల చాటింగ్లు చేశాడని పేర్కొన్నారు.
హరీశ్ వ్యవహార శైలిని మోహన్రావు దృష్టికి తీసుకెళ్తే.. ఆయన కూడా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సాహితిని బెదిరించాడని, దీంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. తండ్రి రాజకీయ అండ చూసుకొని తమ కుమార్తెను మానసికంగా వేధించిన హరీశ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాహితి మృతితో ఆ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా గురువారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ములుగు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.