పోచమ్మమైదాన్, మార్చి 28: వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీ నష్టం చోటుచేసుకున్నది. మూడు అగ్నిమాపక వాహనాలతో ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పోచమ్మ మైదాన్ నుంచి కాశీబుగ్గ రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. జకోటియా కాంప్లెక్స్లోని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఒకేసారి మంటలు లేచాయి. కార్యాలయంలోని కాగితాలు, కంప్యూటర్లు అంటుకొని మంటలు ఎగిసిపడ్డాయి. అందులో ఉన్న ఏసీలు, డెకోలమ్, థర్మకోల్ తదితర వస్తువులతో మంటలు మరింత చెలరేగాయి. మంటల తాకిడి తగ్గకపోగా కింది ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ డిజిటల్లోకి వ్యాపించాయి.
ఇందులో ఉన్న కంప్యూటర్లు, సెల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. దీంతో ఫైరింజన్ సిబ్బంది ఆర్పడానికి శత విధాలా ప్రయత్నం చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కు సంబంధించిన రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తున్నది. సిబ్బంది అంతా అప్రమత్తమై బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. అలాగే రిలయన్స్ డిజిటల్కు సంబంధించి కూడా లక్షలాది రూపాయల నష్టం జరిగినట్టు సమాచారం. మాల్లోని వివిధ కార్యాలయాలు, షాపుల్లో ఉన్న కొనుగోలుదారులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.