హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : మల వ్యర్థాల నిర్వహణపై అధ్యయనంలో భాగంగా జపాన్కు చెందిన ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లోని మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ను సందర్శించింది. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో సమావేశమైంది. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఎఫ్ఎస్ఎస్ఎం(ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్) ప్రాజెక్టులను బృందం సభ్యులు కొనియాడారు.
ఈ సందర్భంగాజపాన్లో అమలుచేస్తున్న వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థను వారు అధికారులకు వివరించారు. అనంతరం సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, వివిధ కార్యక్రమాల గురించి అధికారులు జపాన్ బృందానికి వివరించారు. ఎఫ్ఎస్ఎస్ఎం కింద రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను తమ దేశంలో కూడా అమలుచేసేందుకు కృషిచేస్తామని జపాన్ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. జపాన్ బృందంలో ఆ దేశ పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ప్రముఖులు, ఇంజినీర్లు, పరిశోధకులు ఉన్నారు.