నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఓట్ల కోసమో, రాజకీయ లబ్ది కోసమో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 7,200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. తొలివిడతగా ఈ ఏడాది 9 వేల పై చిలుకు పాఠశాలల్లో 3,400 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
జిల్లాలో మొత్తం 1150 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో 407 బడులలో వసతుల కల్పన కోసం 160 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు. తరగతి గదులు, విద్యుదీకరణ పనులు, పైకప్పు లీకేజీల మరమ్మతులు, ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, ప్రహరీగోడ, నీటి వసతితో కూడిన టాయిలెట్స్, అధునాతన ఫర్నీచర్ తదితర సౌకర్యాలన్నీ సమకూరుతాయన్నారు.
ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులు, బోధనా వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.