Mana Ooru Mana Badi | (నాగవర్ధన్ రాయల, నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో విద్యావ్యవస్థ గాడితప్పింది. ఫలితంగా శిథిల బడులు. నిర్లక్ష్యపు నీడలో నిరుపేద బాల్యం చదువులు కొనసాగించాల్సి వచ్చింది. స్వరాష్ట్రంలో దశాబ్దాల చరిత్రలో ఊడలు దిగిన వెనుకబాటును కూకటివేళ్లతో పెకిలిస్తూ తెలంగాణ సర్కారు కొత్త బడికి, నూతన ఒరవడికి తెర తీసింది. ‘మన ఊరు-మన బడి’ అనే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7,829.55 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పూనుకొన్నది. కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. కేవలం బడికి భవనాలు కట్టి.. రంగులు అద్ది.. ఫర్నిచర్, టాయిలెట్లు నిర్మించడమే కాదు.. విద్యార్థికి డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. మన బడి అంటే చదువొక్కటే కాదు.. ఆటలు, పాటలు, ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందాల ఒడి అంటూ పిల్లలు చెంగుచెంగున వచ్చేలా విద్యానిలయాలను తీర్చిదిద్దుతున్నది.
‘వెనుకబాటుతనం’ అనే మాటకు పర్యాయంగా ఉండే ‘ఆదివాసీ గూడెం’లో పుట్టింది యామిని. ఆ గూడెం పేరు ఒడ్డు రామవరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మం డలంలో ఆ గూడెం ఉన్నది. ఆదివాసీ గూడేల్లో ఒకప్పుడు మంచినీళ్లకే కటకట. ఇక తిండి, బట్ట గురించి చెప్పేది లేదు. పొట్టకు, బట్టకు అన్నీ తిప్పలు పడే చోట చదువుకోవాలంటే ఇంకెన్నో తిప్పలు పడాలి. బడికి వెళ్లేందుకు దారి ఉండదు. రాళ్లు, ముండ్లు దాటుకొని పో యినా ఆ రోడ్డున్నట్టే బడి ఉండేది. పెచ్చులూడే గోడలు, వానకురిస్తే చెమ్మదిగే స్లాబులు, రం గు వెలిసి వెనుకబాటుకు చిహ్నంగా బడి దర్శనమిచ్చేది. ఇన్ని బాధలు పడే కంటే అప్పోసప్పోజేసి ప్రైవేటు బడికి పిల్లల్ని పంపించే పేద తల్లిదండ్రులు ఎందరో. కానీ, యామిని వాళ్ల అమ్మానాన్నకు అప్పుజేసి ప్రైవేటు చదువు చదివించే స్తోమత లేదు. వాళ్ల నాన్న లారీ డ్రైవర్. అమ్మ కూలికి పోతేనే ఇల్లు గడిచేది. తాను చదువుకోకున్నా తన బిైడ్డెనా బాగా చదువుకొ ని బాగుపడాలని ఆ తల్లి కోరిక. కానీ, మంచి చదువు లేదనే బాధ ఉండేది. గవర్నమెంట్ బడిలో ‘సదువొస్తుందా?’ అనే సందేహంతోనే గూడెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు పంపించింది. ఎన్నో ఏండ్ల నుంచి గూడెం పిల్లలందరిలాగే యామిని చదువు సాగిపోతున్నది. నాలుగో తరగతికి వచ్చినా ఇంకా వెనుకబడే ఉంది. ఆ చదువు రాని తల్లికి తన బిడ్డ బాగా చదువుతుందో, లేదో తెలియదు. ఏదో బడికి పోతున్నది.. వస్తున్నది అంతే. యామిని 2022-23లో 4వ తరగతిలో అడుగుపెట్టింది. కూడికలు రావు. తీసివేతలు రావు. భాగహారాలు అసలే తెలియవు. ఇదొక్క యామినికే కాదు.. యావత్తు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్య. వీటికి చెక్పెడుతూ తెలంగాణ సర్కారు కొత్త ఆలోచన చేసింది. ప్రతి విద్యార్థి వయసుకు తగ్గ విద్యాసామర్థ్యాన్ని అందుకొనేందుకు విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సర్కారు బడుల్లో తొలి‘మెట్టు’ వేసింది.
ఏడాదికో తరగతి చదవడం అంటే ఆ ఏడాదిలో విద్యార్థికి నిర్ధేశించిన (వయసుకు తగిన) విద్యా సామర్థ్యాలను అందుకోవడం. కానీ, కొందరు అవి అందుకోకుండానే ఆ తర్వాత ఏడాది పైక్లాసుకు వస్తున్నారు. ‘కనీస సామర్థ్యాలు’ లేక చదువురాని వాళ్లుగా ముద్రపడుతున్నారు. ఆత్మన్యూనతతో బడి మానేస్తున్నా రు. ఇష్టంలేని చదువుతో మొండివాళ్లుగా త యారవుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ‘తొలిమెట్టు’కు రూపకల్పన చేసింది. నిరుడు పాఠశాలలు తెరిచిన జూన్లో బడి పిల్లలందరికీ (బేస్ లైన్ టెస్ట్) కనీస విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. ఒడ్డు రామవరం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న యామినికి టెస్ట్ పెట్టి తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంలో ఉన్న విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే గణితంలో చతుర్విధ ప్రక్రియలు ఎంత వరకు చేయగలదో పరీక్షించారు. ఆ పరీక్ష ఆధారంగా ఆమె ప్రగతిని సూచించే నివేదికలో ఏమి వచ్చు? ఏమి రాదో? రికార్డు చేశారు. ‘తొలిమెట్టు’లో భాగంగా యామిని చదివే 4వ తరగతికి ఆశించే విద్యా సామర్థ్యాలను నేర్పడం పనిగా పెట్టుకున్నారు. ఏడాది తిరిగే సరికి ‘తొలిమెట్టు’ నుంచి యామని ఎన్నెన్ని మెట్లెక్కిందో! సెప్టెంబరు నాటికి (మూడు నెలల్లో) కూడికలు నేర్చుకొన్నది. అక్టోబరు నాటికి కూడికలతోపాటు తీసివేతలు కూడా వచ్చా యి. డిసెంబరు నాటి పరీక్షలో హెచ్చవేతలు కూడా సరిగా చేసింది. కానీ భాగహారాల్లో త ప్పులు దొర్లాయి. జనవరి నాటికి ఆమె సామర్థ్యాలు అంతే ఉన్నాయి. ఫిబ్రవరి నాటికి గణితంలోని చతుర్విధ ప్రక్రియలు నేర్చుకొని అందరి విద్యార్థుల్లా చదువుతున్నది. గణితంలోనే కాదు తెలుగు, ఇంగ్లిష్ చదువడం, రా యడంలో ఇదే పద్ధతిలో యామినిలాగే అందరినీ తీర్చిదిద్దారు. పని దినాల్లో అదనపు తరగతులు తీసుకొన్నారు. వేసవి సెలవుల్లో కూడా ‘తొలిమెట్టు’ లక్ష్యాల కోసం ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు నిర్వహించారు. సమ్మర్ క్లాసులకు రావడం వల్ల మూడో తరగతి వరకు కూడికలు కూడా రానివారు ఇప్పుడు గుణకారాలు, భాగహారాలు అలవోకగా చేస్తున్నారు. తొలిమెట్టు విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమేకాదు.. సర్కారు బడుల పై ఉన్న అపవాదులన్నింటినీ పోగొడుతున్నది. విద్యార్థులను మెరికల్లాగా మార్చేస్తున్నది.
టీచర్లూ స్టూడెంట్సే!
ప్రతి విద్యార్థిని నెలనెలా పరీక్షించడం క్లస్టర్ రిసోర్స్పర్సన్ బాధ్యత. ఈ పరీక్షను నామమాత్రం చేయడానికి వీల్లేదు. ఈ పరీక్ష కోసం రూపొందించిన ‘టాంగరిన్’ యాప్ జీపీఎస్ ఆధారంగా ఓపెన్ అవుతుంది. కాబట్టి బడికి పోవాల్సిందే.. పరీక్ష పెట్టాల్సిందే. ఏ బడిలో తక్కువ ప్రగతి ఉందో ఆ బడిలోని ఉపాధ్యాయులు అదనంగా పని చేసి ప్రగతిని చూపించాలి. ఆ బడిని పర్యవేక్షించే నోడల్ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ఎక్కువ సార్లు ఆ పాఠశాలను సందర్శించాలి. తొలిమెట్టులో ప్ర గతిలేని టీచర్లకు శిక్షణ ఉంటుంది. తొలిమెట్టు ఆశించే ఫలితాల కోసం ఆ టీచర్లూ విద్యార్థులుగా మారాల్సిందే! తెలుగు, ఇంగ్లిష్, గణితం బోధనలో కొందరు ప్రయోగాలు చేస్తున్నారు. విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పే ఉపాధ్యాయులు అందరితో అనుభవాలు పం చుకొనేలా వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలుసుకొన్న కొత్త విషయాలతో ప్రయోగాలు చేస్తూ పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
పేరెంట్ టీచర్ మీటింగ్
విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి మూడో శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ రోజు తమ పిల్లల చదువు ఎలా ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లలు వెనుకబడితే ఇంట్లో చదివించడం, చదువుకోవడానికి అనుకూల వాతావరణం కల్పించడం గురించి చెప్తున్నారు. పిల్లల పైచదువుల వల్ల ప్రయోజనం గురించి ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
‘గ్రోబై’తో గ్లోబల్ నాలెడ్జ్
పిల్లల జీవితం పాఠ్యపుస్తకాల చుట్టే తిరగకూడదు. విశాలమైన ప్రపంచంలో వాళ్ల ఊహలు విహరించాలి. ఎదుగుతున్న ఆ మెదడులో ఊహల ప్రపంచాన్ని నిర్మించే కాన్సెప్ట్ ‘గ్రోబై’. ఏడురంగుల ప్రపంచంలోని వింత లు, విశేషాలను పిల్లల కళ్లకు కట్టేందుకు భలే భలే కథలెన్నో చెప్పే కాన్సెప్ట్ ఇది! జీ ఫర్ గ్రీన్. గ్రీన్ బుక్ తీసుకొంటే అందులో 10 పేజీలే ఉంటాయి. పేజీకి 5 పదాలకు మించకుండా, పది పేజీల్లోనే కథ ముగిసిపోతుంది. ఇలా చి న్నచిన్న కథలతో మొదలైన పుస్తక చెలిమి మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. పేజీకి రెండు మూడు వాక్యాలతో పెరిగి కథ పెద్దదవుతూ పోతుంది. అలా పరిచయమైన కథలు చదవడానికి అలవాటు పడితే ఇక ఎంత పెద్ద కథైనా చదివేస్తారు. వై ఫర్ యల్లో. ఈ పసుపు రంగు పుస్తకం చేతికొచ్చే సరికి పేజీకి రెండు పేరాలుంటాయి. పుస్తకానికి రెండు మూడు కథలుంటాయి. కథలో బోరుండదు. చదువడం భారంగా ఉండదు. అంతా పిల్లల ఇష్టాలకు తగ్గట్టే రంగురంగుల బొమ్మల కథలు చదువడమే మాకిష్టం అంటున్నారు
చిన్నారులు!
సెన్స్ ఫెస్ట్తో విజ్ఞానశాస్త్రంపై పట్టు
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 2016 నుంచి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. విజేతలకు బహుమతులు ఇచ్చి పోత్సహిస్తున్నారు. ఎంపిక చేసిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. ప్రతి ఏటా ఒక థీమ్ ఇచ్చి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు.
బ్యాక్ బెంచ్ క్లెవర్స్!
బడిలో చురుకైన విద్యార్థులు ముందు, వెనుకబడిన విద్యార్థులు చివర్లో కూర్చుంటారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు బడుల్లో అలా లేదు. ప్రతి తరగతిలో అందరికీ కనీస విద్యా సామర్థ్యాలను పరీక్షించి, వాళ్లను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజిస్తున్నారు. ప్రతి బెంచీపై ఏ,బీ, సీ గ్రూపులో ఉన్న విద్యార్థులు ఉండాలి. బాగా చదివే విద్యార్థి యావరేజ్, బీలో యావరేజ్ విద్యార్థికి చదువులో సహకరించేలా టీచర్లు ప్రోత్సహిస్తున్నారు. అలాగే సాయంత్రం ఏ సబ్జెక్టులో వెనుకబడ్డ వాళ్లను ఆ గ్రూపులో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. సామూహిక అభ్యసనం వల్ల పిల్లల్లో స్నేహాన్ని పెంపొందించడంతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా పెంచుతున్నారు.
మన బడి.. మన బాధ్యత
తొలిమెట్టును ఏ టీచరైనా తేలిగ్గా తీసుకొంటే దొరికిపోవడం ఖాయం! తొలిమెట్టులో ప్రతి విద్యార్థిలో ప్రగతితోపాటు పాఠశాల ప్రగతి కనిపించాలి. విద్యార్థులు, టీచర్ల రోజువారీ అ టెండెన్స్ నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితంలో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తున్నారు. ప్రతినెలా పాఠశాల, క్లస్టర్, మండలం, జిల్లా వారీగా హెచ్ఎం, నోడల్, మండల, జిల్లా వి ద్యాశాఖాధికారులు, కలెక్టర్లు సమీక్షించి బోధ నా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మార్పు లు చేస్తూపోతున్నారు. ‘బడిలో చేరిన పిల్లలందరికీ చదువు చెప్పడమే కాదు, చెప్పిన చదువు ఒంట బట్టించడం కూడా మా బాధ్యతే’ అని టీచర్లు చెప్తున్నారు.
పఠనోత్సవంతో నూతనోత్సాహం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 26 నుంచి జూలై 31 వరకు పఠనోత్సవం నిర్వహిస్తున్నారు. అన్ని తరగతుల వారికీ పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ కేటాయించారు. ఈ విధానాన్ని 2021 – 22 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. చదవడం అలవాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
చక్కని చేతిరాతకు వర్క్బుక్స్
విద్యార్థుల చేతి రాతను మెరుగుపరిచేందుకు 1 నుంచి 5వ తరగతి వారికి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ వర్క్ బుక్స్ని రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారు.
కార్పొరేట్ ైస్టెల్లో యూనిఫాం
పేద విద్యార్థులకు సరైన దుస్తులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా యూనిఫాంలను తెలంగాణ సర్కారు ఉచితంగా అందిస్తున్నది. బాలికలకు ఈ విద్యా సంవత్సరం నుంచి వయసుకు తగినట్టుగా మూడు రకాల దుస్తులను డిజైన్ చేయించారు. బాలురకు రెండు రకాల యూనిఫామ్ను రూపొందిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యూనిఫాం అందిస్తున్నారు.
నెలకో మెట్టు
సంచార జాతుల పిల్లలు సాధారణంగానే వెనుకబడి ఉండేవాళ్లు. లాక్డౌన్ వల్ల చాలా మంది వచ్చినవి మర్చిపోయారు. రెండేండ్ల తర్వాత పిల్లల్ని గాడిలో పెట్టడం సాధ్యమా? అనుకున్నాం. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని తొలిమెట్టు లక్ష్యాల కోసం పని చేశాం. పిల్లలకు ఇబ్బంది లేకుండా మొదటి నెలలో సరళ అక్షరాలు నేర్పించాం. ఆ తర్వాత నెలలో గుణింతాలు నేర్పించాం. తర్వాత ఒత్తులు, ద్విత్వాక్షరాలు నేర్పిస్తూ సరళ పదాల నుంచి సంయుక్తాక్షర పదాలు చదివేలా చేశాం. ప్రతి నెలా ఎంత మంది నేర్చుకున్నారు. ఎంతమంది మిగిలారో? గుర్తించి తర్వాత నెల ప్రణాళికను వేసుకున్నాం. చిన్న చిన్న ప్రణాళికలతో తొలిమెట్టు లక్ష్యం చేరుకొన్నాం.
– కే పద్మజ, ప్రధానోపాధ్యాయురాలు,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎన్ఎస్పీ క్యాంప్, ఖమ్మం)
ప్రతిభకు తొలిమెట్టు
గతంలో కొం తమంది చదువడం, రాయడంలో పూర్తిస్థాయి ప్రతిభ లేకుండానే ఐదో తరగతి పూర్తి చేసేవాళ్లు. తొలిమెట్టు ప్రవేశపెట్టిన 2022- 23 విద్యా సంవత్సరంలో మా బడిలో 14 మంది విద్యార్థు లు 5వ తరగతి లో ఉన్నారు. అం దరూ తెలుగు, ఇంగ్లిష్ చదువడం, రాయడం నేర్చుకొన్నారు. గణితంలో 10 మంది చతుర్విధ ప్రక్రియలు చేయగలరు. నలుగురు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు చేయగలరు. తొలిమెట్టుని బాధ్యతగా అమలు చేయడం వల్లనే విద్యా సామర్థ్యాలు పెరిగాయి.
– పెద్దమ్మాయి, ప్రధానోపాధ్యాయురాలు,ప్రైమరీ స్కూల్ ఒడ్డురామవరం (భద్రాద్రి కొత్తగూడెం)
అందరితో సమానంగా చదువుతున్నా..
ఒకటో తరగ తి వరకు బడికి వచ్చాను. ఆ తర్వాత కరోనా వచ్చిందని బడి పెట్టలేదు. మళ్లీ నాలుగో తరగతి కే బడికి వచ్చా. టీచర్లు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారా లు నేర్పించారు. ఇప్పుడు అందరితోపాటు నేను బాగా చదువుతున్నాను.
– సందేశ్, 5వ తరగతి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఎన్ఎస్పీ క్యాంప్, ఖమ్మం
చెప్పినట్టే చదివిస్తున్నది
మా అమ్మ రోళ్లు కొడుతుంది. నాన్న చనిపోతే బుల్లంపల్లి (మహబూబ్నగర్) నుంచి మా అమ్మమ్మ వాళ్ల ఊరు (మల్లంపల్లి, ములు గు జిల్లా)కి వ చ్చాం. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రో జులు చదివాను. మధ్యలో సరిగా బడికి పోలే. మా అమ్మ పేరెంట్స్ మీటింగ్కి వస్తే మీ అబ్బాయి వెనుకబడ్డాడు అని చెప్పారు. అప్పటి నుంచి అమ్మ రోజూ ఇంట్లో చదివిస్తున్నది.
– కాశ తిమ్మరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లంపల్లి, ములుగు జిల్లా