హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): జల్సాల కోసం ఇంట్లోనే దొంగతనం చేద్దామనుకొన్నాడో యువకుడు.. స్నేహితులు కూడా ఎంకరేజ్ చేశారు.. అంతా కలిసి ఇంట్లోకి చొరబడి నగలు, డబ్బు దొంగిలించారు. అలికిడి శబ్దం విని లేచిన తల్లిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత శ్రీశైలం అడవుల్లో ఆ యువకుడు కూడా స్నేహితుల చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళితే.. సరూర్నగర్లోని న్యూగడ్డి అన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్, భూదేవి అలియాస్ లక్ష్మి దంపతులకు సంతానం లేదు. జంగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు. వీరు సాయితేజను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. అతడికి బుద్ధి మాంద్యం ఉన్నది.
అయితే, జంగయ్య దగ్గర పనిచేసే డ్రైవర్ నరసింహతో కలిసి సాయితేజ చెడుమార్గంలో పడినట్టు తెలిసింది. అతడికి నరసింహ గంజాయి, అమ్మాయిలను పరిచయం చేసినట్టు సమాచారం. జల్సాలకు అలవాటు పడ్డ సాయితేజ.. తన గర్ల్ఫ్రెండ్కు నగలు ఇవ్వటానికి తల్లిని చంపి, ఇంట్లోనే దొంగతనం చేయాలని చూశాడు. ఈ విషయాన్ని నరసింహకు చెప్పటంతో అతడూ జత కలిశాడు. నరసింహ తన స్నేహితులు శివ, చింటు, అంజి, సాయి గౌడ్ను పిలిచి చోరీకి ప్లాన్ వేశారు. సాయితేజ ఈ నెల 7న తెల్లవారుజామున నరసింహకు ఫోన్ చేసి దొంగతనానికి రమ్మనాడు. అందరూ కలిసి ఇంటి వెనకాల నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లారు. సాయితేజ, శివ కలిసి దిండుతో లక్ష్మికి ఊపిరాడకుండా చేశారు. చేతులను నరసింహ, కాళ్లను సాయిగౌడ్, చింటు అదిమిపట్టి చంపేశారు.
ఆ తర్వాత నగలతో గోడ దూకి పారిపోయారు. కింది అంతస్తులో నిద్రపోయిన జంగయ్య.. ఉదయం పైకి వచ్చి చూసేసరికి లక్ష్మి అపస్మారక స్థితిలో కనిపించటంతో స్థానిక దవాఖానకు తరలించారు. ఆలోగా ఆమె చనిపోయింది. గుండె పోటుతో మరణించిందని అంతా భావించారు. అంత్యక్రియల కోసం ఆమె అల్మరా నుంచి చీర తీసేందుకు వెళ్లగా వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. నగదు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. కొడుకు కూడా లేడు. అనుమానం వచ్చి జంగయ్య.. సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఊపిరాడకుండా చేసి చంపారని ప్రాథమికంగా తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, సాయితేజ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, సాయితేజకు బుద్ధి మాంద్యం అని, పోలీసులకు చెప్పినా చెప్పేస్తాడని.. అతడిని ఎక్కడికైనా తీసుకెళ్లి చంపాలని శివను నరసింహ పురమాయించాడు. దానికోసం అధిక వాటా ఇస్తానని ఆశ పుట్టించాడు. దాంతో శివ.. సాయితేజను తీసుకొని శ్రీశైలం వెళ్లాడు. అక్కడ సాయితేజ తలనీలాలు ఇచ్చాడు. ఈ నెల 10న అమ్రాబాద్ అడవిలోని మల్లెల తీర్థానికి వచ్చారు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అక్కడే సాయితేజను శివ బండరాయితో మోది చంపేసి, మృతదేహాన్ని నీళ్లలో పడేశాడు. అనంతరం తనంతట తానే పోలీసుల ముందు లొంగిపోయి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. శివ వద్ద రూ.1.4 లక్షల విలువైన హారాన్ని స్వాధీనం చేసుకొని, అతడు చెప్పిన వివరాలతో మల్లెలతీర్థానికి వెళ్లి సాయితేజ మృతదేహన్ని గుర్తించారు. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట దవాఖానకు తరలించారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.