హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు పితృవియోగం కలిగింది. శనివారం ఉదయం తెల్లవారు జామున హనుమకొండ జిల్లా శాయంపేటలోని తన నివాసంలో డాక్టర్ మామిడి సుదర్శన్ (86) కన్నుమూశారు. ఆయన రెండేండ్ల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ ఆయుర్వేద కళాశాలలో పట్టా పొందిన అనంతరం జిల్లాలో దశాబ్దాలుగా సమాజసేవకు అంకితమై పనిచేశారు.
మూడు దశాబ్దాల క్రితం సుదర్శన్ సతీమణి స్వరాజ్యం మరణించినప్పటికీ శాయంపేట చుట్టుపకల 20 ఊర్లకు ఆయన చేసిన వైద్యసేవలు అజరామరమని మిత్రులు పేర్కొన్నారు. సాహిత్య విశ్లేషకుడిగా, రాజకీయ సమీక్షకుడిగా హన్మకొండ జిల్లా శాయంపేట పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితుడిగా నిలిచారు. శనివారం సాయంత్రం హన్మకొండ జిల్లా శాయంపేటలో డాక్టర్ సుదర్శన్ అంత్యక్రియలు ముగిశాయి.