వరంగల్ : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ పథకాల అమలు నేపథ్యంలో మహిళా దినోత్సవం సంబురాలు ఘనంగా చేపట్టాలని, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళ కోసం తీసుకువచ్చిన పథకాలు మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో ఈ సారి మహిళా దినోత్సవంతో.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనుసంధానించి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. మిషన్ భగీరథతో ఆడబిడ్డల కష్టాలను దూరం చేశారని, మాతా శిశు సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నారన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని, బాలికా.. మహిళా విద్య కోసం ప్రత్యేక స్కూల్స్.. కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. పిల్లలకు 70లక్షల హెల్త్ హైజెనిక్ కిట్లను అందించారని, ఆయా పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.