మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18 గంటలు చదవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సమయం ఎంతో విలువైనది, వృథా చేయొద్దన్నారు. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగ ప్రకటన చేయడంతో తన తల్లిదండ్రుల స్మారకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే గ్రూప్స్, పోలీసు ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ అందించినట్టు మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటే విజయం సొంతమవుతుందన్నారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదని, పేదలుగానే మిగిలిపోవడం మాత్రం తప్పన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు నిరుత్సాహ పడొద్దని ప్రైవేట్ రంగంలోనూ అత్యుత్తమ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇటీవల జాబ్మేళా ద్వారా 3,500 మందికి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు అందించినట్టు చెప్పారు. దివిటిపల్లి వద్ద ఐటీ పార్కు పనులు పూర్తయిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వివిధ అంశాల్లో నైపుణ్యాలను పెంచి స్థానికంగానే మంచి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీహిత మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు నిరుద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు. గ్రూప్స్ కోసం కూడా సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ముడా చైర్మన్ గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.