కొండాపూర్, మార్చి 24: ఒకప్పుడు కిలకిలరావాలతో ఆత్మీయంగా పలుకరించిన పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయి. పట్ణణాల్లోనూ వాటి జ్ఞాపకాలు లేకుండా చెదిరిపోతున్నాయి. వాటి నిలువనీడను అవే తయారుచేసుకొన్నప్పటికీ మనం వాటిని రక్షించలేకపోతున్నాం. కాసిన్ని నీళ్లు పోయలేక వాటి అంతానికి కారణమవుతున్నాం. ఇలాంటి సందర్భంలో పిచ్చుకలను కాపాడుకుందామంటూ ‘ఐలవ్ స్పారోస్’ పేరుతో రోటరీ క్లబ్ ఆఫ్ అభ్యుదయ్ ఆధ్వర్యంలో గురువారం షేక్పేట్లోని జీ నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో పిచ్చుకగూళ్ల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. పిచ్చుకల రక్షణకు మనవంతుగా చేయాల్సిన కర్తవ్యం ఏమిటీ? పట్టణ ప్రాంతాల్లో పిచ్చుకలను కాపాడుకోవడానికి ఎలాంటి చొరవ తీసుకోవాలి? పిచ్చుకల అంతం ఎలాంటి జీవపర్యావరణ హానికి కారణమవుతుంది? పిచ్చుకలను రక్షించుకుంటే పర్యావరణ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా హాజరైన లేడీ ఆఫ్ ది లేక్స్, ధృవ్ ఫౌండేషన్ నిర్వాహకులు మధులిక చౌదరి మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
ఇంటి పరిసరాల్లో పిచ్చుకలకు అవసరమైన ఆహారం, మంచినీటిని అందించడంతో పాటు వాటి ఆవాసాలను తొలగించొద్దని చెప్పారు. 2016లో నెక్నాంపూర్ చెరువును స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహకారంతో అందంగా తీర్చిదిద్దడంతో అక్కడ పెరిగిన పచ్చదనం, చెట్లు అనేక పక్షులకు ఆవాసంగా మారాయని తెలిపారు. నెక్నాంపూర్ చెరువుతో పాటు తెలంగాణ, మహారాష్ట్రలతో పాటు పలు ప్రాంతాల్లో చెరువులను దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. అనంతరం రోటరీక్లబ్ ప్రతినిధులు పద్మజా మాట్లాడుతూ నేటి తరానికి పిచ్చుకల గురించి తెలియడం లేదని చెప్పారు. అంతరించిపోతున్న ఎన్నో పక్షులు, జంతువులను గురించి గూగుల్లో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ తరంగాల వలన పిచ్చుకలలో సంతానోత్పతి తగ్గిందని పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏర్పడిన గ్రీన్ క్రైసిస్ను తొలగించేందుకు ఆ దేశ శాస్త్రవేత్తలు ఇండియా, ఆసియా ఖండాల నుంచి పిచ్చుకలను తీసుకువెళ్ళి అక్కడ వదిలేయడంతో సమస్య తీరినట్టు చెప్పారు. ప్రత్యేకంగా పంటలను నాశనం చేసే పలు రకాల కీటకాలను, ఇండ్ల ఆవరణలో నిల్వ ఉన్న నీటిపై పెరిగే దోమల లార్వాను సైతం ఆహారంగా తీసుకొని మనుషులకు ఎంతోమేలు చేస్తాయని తెలిపారు. అనంతరం పిచ్చుక గూళ్లు, మంచినీటి పాత్రలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ఫౌండర్ ఏకాంభరరెడ్డి, ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి, రోటరీ ప్రతినిధులు సురేష్, శ్రీనివాస్, మూర్తి, సునీల్, విద్యార్థులు పాల్గొన్నారు.