హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్ ‘గ్రామీణ ఆవిష్కరణల అభివృద్ధి కార్యక్రమం’లో భాగంగా 14 ఏండ్ల విద్యార్థిని ఆవిష్కరణకు అండగా నిలిచింది. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీజ నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు వినియోగించే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వేరుశనగ పొట్టుతో భూమిలో కలిసిపోయే కుండీలను తయారు చేసింది. పర్యావరణహితమైన ఈ ఆవిష్కరణకు సీఎస్ఐఆర్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ కౌన్సిల్ (టీఎస్ఐసీ) నుంచి అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే టీవర్క్స్ శ్రీజ ఆవిష్కరణకు మరింత ప్రోత్సాహం అందించేందుకు బయోడీగ్రేడబుల్ పాట్ (బయోపాట్) ఉత్పత్తికి ‘బయోప్రెస్ 4 టీ’ అనే ప్రత్యేక మిషన్ను తయారుచేసింది. గతంలో నెలకు 150 కుండీలు మాత్రమే తయారు చేసిన శ్రీజ ఈ మిషనరీ సాయంతో నెలకు 6వేల కుండీలను తయారు చేయగలదని టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి తెలిపారు. వివిధ డిజైన్లలో కుండీలు తయారు చేసేలా దీన్ని రూపొందించామని, అవసరమైతే నెలకు 50వేల కుండీలను ఉత్పత్తి చేసేలా ఈ డిజైన్ను మార్చుకోవచ్చని చెప్పారు. టీవర్క్స్ రూరల్ ఇన్నోవేషన్ ప్రోగామ్ ద్వారా తొలి ఆవిష్కర్తగా శ్రీజను ఎంపిక చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ఈ మిషనరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.