హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రతి పౌరుడి మనసు ఉప్పొంగేలా జూన్ 2వ తేదీన తెలంగాణ జనగీతం ప్రజల ముందుకు వస్తున్నదని, ఇందుకు సంబంధించిన రికార్డింగ్ పూర్తయిందని గేయరచయిత మిట్టపల్లి సురేందర్ వెల్లడించారు. ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..’ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేసిందో.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న పాట కూడా తెలంగాణ సమాజపు సుప్రభాతగీతమై అలరారనున్నదని తెలిపారు. తన పాట ఒకరికి పోటీ కాదని, అలాగే ఒకరిపాట తనకూ పోటీకాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కొత్తపాటను విడుదల చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నానని వెల్లడించారు.
2014లో ‘వచ్చిందే స్వాతంత్య్రం..తీరిందే వనవాసం.. తెచ్చిందే కొండంత పండుగలే మనకోసం. కదిలొచ్చే కాలంతో వెల్లువలా సంతోషం.. మొలిచిందే సంతోషం పైరల్లే దరహా సం..’, 2015లో ‘మన గుండె గుణము..అది గునుగు వన ము. అందరికీ అమ్మ ఈ భువనం.. త్యాగాల మునుము మన చరిత ఘనము..’ ఇలా ప్రతి సంవత్సరం జూన్ 2న ఒక కొత్తపాటను విడుదల చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది పూర్తి చేసుకుంటున్న తరుణంలో విడుదల కానున్న పాటకు ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. ఆ పాటను పూర్తిగా తెలంగాణలో పుట్టిన తేనెతుట్టెలాంటి ఆడబిడ్డలు ఆలపించిన పాట అని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వర సుప్రభాత గీతాన్ని ఎంఎస్ సుబ్బులక్ష్మి.. మరో ఇద్దరు భక్తిభావంతో చేసిన గాత్రానికి ఉండే మాధుర్యం ఈసారి తను విడుదల చేయనున్నపాటకు ఉంటుందని అన్నారు.