హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నేటి కాలంలో చాలామంది గంటల తరబడి కంప్యూటర్, ఫోన్ స్క్రీన్వైపు చూస్తూ గడుపుతుండటంతో అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. వయసు సంబంధిత కారణాలు, వ్యాధికి గురికావడం కూడా కండ్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కాలక్రమంలో ఇవి నో లైట్ పర్సెప్షన్ (అంధత్వం)కు దారితీసే ప్రమాదం ఉన్నదని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎన్ఎల్పీ సమస్యపై నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విజన్ లాస్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో 40 మిలియన్ల మంది అంధులు ఉన్నారు. వీరు కనీసం ఒక మీటర్ దూరంలో ఉన్న చేతి వేళ్లను సైతం లెక్కించలేని స్థితిలో ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. రోజురోజుకూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ సయన్ బసు, ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ విపిన్దాస్ 2010 నుంచి 2022 మధ్య 32,78,132 మంది రోగుల రికార్డులను పరిశీలించగా 60,668 (1.85 శాతం) మందికి ఎన్ఎల్పీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిం ది. స్త్రీల కంటే పురుషుల్లో (64 శాతం)నే ఈ సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. పట్ట ణ, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించేవారితో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల వారిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. గ్లకోమా, గాయం వంటి ప్రాథమిక కారణాలు ఈ సమస్యకు దారితీస్తున్నట్టు వెల్లడైంది. నరా ల పునరుత్పత్తి ప్రక్రియ, ఐబాల్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు ఎన్ఎల్పీ ప్రాబల్యాన్ని నివారించేందుకు ఔషధాలుగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో దృష్టి పునరుద్ధరణ చికిత్సలను మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ ఆంథోనీ విపిన్దాస్ తెలిపారు.