హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారిలో 90 శాతం మంది ఊపిరితిత్తుల బాధితులే ఉంటున్నారని కిమ్స్ దవాఖాన పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభాకర్ తెలిపారు. పురుషులే ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినాన్ని పురస్కరించుకొని ఆయన వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ధూమపానం చేసే వారిలో పురుషుల్లో 90 శాతం, మహిళల్లో 80శాతం ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, వ్యాధి ముదిరిన తరువాత బయటపడటం వల్ల ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్ శుభాకర్ వివరించారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయగలిగితే జీవిత కాలాన్ని ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి పెంచవచ్చని తెలిపారు. నిరంతరం దగ్గు, గొంతు బొంగురుపోవడం, దీర్ఘకాలం శ్వాసకోశ సమస్య ఏర్పడటం, ఛాతీలో నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఎముకల నొప్పి వంటివి దీని లక్షణాలు.