హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు తీరని నష్టం వాటిల్లనున్నదని సర్వాయిపాపన్న మోకుదెబ్బ (గౌడ సంఘం) వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని గతంలో చెప్పిన సుప్రీం కోర్టే.. ఇప్పుడు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
దేశం మొత్తంలో అగ్రవర్ణాలు 10 శాతం కూడా లేరని, అందులో పేదలు 2 శాతం కూడా దాటరని.. వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు 60 శాతం ఉంటే కేవలం 27 శాతం రిజర్వేషన్ ఉన్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.బీసీ కుల సంఘాలు ఒకటై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకోవాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేవరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.