హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో మ. ఒంటి గంట తర్వాత లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అన్ని రకాల ప్రజా రవాణాకు మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. ఈ గంట సమయంలోనే అందరూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నారు. ఈ మార్గదర్శకాలు జూన్ 9వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. నిన్నటి వరకు కేవలం నాలుగు గంటలు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉండే.