హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జీవం పోశారు ప్రతిమ హాస్పిటల్ వైద్యులు. 11 నెలల అర్హాన్కు కామెర్లు సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మల విసర్జనలో రక్తస్రావం, పొత్తికడుపు ఉబ్బడంతోపాటు నొప్పిగా ఉండటం, దురద తదితర సమస్యలతో చిన్నారి నిర్విరామంగా ఏడ్చేవాడు. తల్లిదండ్రులు హైదరాబాద్లోని ప్రతిమ హాస్పిటల్లో చిన్నారిని చూపించారు.
హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ మధుసూదన్ పర్యవేక్షణలో అర్హాన్కు వివిధ వైద్య పరీక్షలు చేశారు. చిన్నారి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, 60 వేల మందిలో ఒకరికి జన్యుపరంగా వచ్చే ‘అలగెల్లె’ సిండ్రోమ్తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. చిన్నారికి కాలేయ మార్పిడి ఒకటే మార్గమని వివరించారు. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఉచితంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు, యాజమాన్యం నిర్ణయించారు. సర్జికల్ పరికరాలు, ఔషధాల కోసం డాక్టర్ మధుసూదన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. రోగి తల్లి నుంచి కొంత కాలేయ భాగాన్ని సేకరించి చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.