హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారత జాగృతి ఆధ్వర్యంలో జూన్ 12, 13 తేదీల్లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం మేరకు హైదరాబాద్లో రెండు రోజులపాటు సాహితీ సభలను జరుపనున్నారు. హైదరాబాద్లోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో నిర్వహించే సాహిత్య సభల్లో తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై లోతైన సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయని నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 12 ఉదయం ‘స్వరాష్ట్రంలో సాహితీ వికాసం’ పేరుతో జరిగే సమావేశంతో సభలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆరు సెషన్లలో వివిధ రంగాలపై సాధికార అవగాహన కలిగిన, అధ్యయనం, పరిశోధన చేసిన సాహితీమూర్తుల ప్రసంగాలు ఉంటాయని వివరించారు. 13వ తేదీ సాయంత్రం సాహిత్య సభలు ముగుస్తాయని తెలిపారు. సాహితీ సభల్లో భాగంగా తన రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఒక సాహితీమూర్తికి ‘ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురసారం’ భారత జాగృతి ఇవ్వనున్నదని వెల్లడించారు. విస్తృత రచనలు, వివిధ ప్రక్రియలు, లోతైన అధ్యయనం, జనహితం ప్రాతిపదికలుగా ప్రతి సంవత్సరం ఒకరిని ఎంపిక చేసి అవార్డును ఇస్తామని వెల్లడించారు.