హన్మకొండ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎంతో ముందు చూపుతో తీసుకొచ్చిన దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, దళితుల బాగు కోసం దళితబంధు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ మనందరికీ ఆత్మబంధువు అని కొనియాడారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో గురువారం దళితబంధు కార్యక్రమం కింద రూ.4 కోట్ల 81 లక్షల 49 వేల విలువైన వాహనాలను కమలాపూర్ మండలంలోని 51 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు అందజేశారు.
షెడ్యూలు కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 10 మందికి హార్వెస్టర్లు, ఇద్దరికి ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఒకరికి ఆటో ట్రాలీ, ఇద్దరికి బొలోరోలు, ఒకరికి జేసీబీ వాహనం, 16 మందికి ట్రాక్టర్లు, రోటా వేటర్లు, ఇద్దరికి ట్రాక్టర్లు, ట్రాలీలు పంపిణి చేశారు.
ఈ పంపిణి కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, శ్రీధర్ బాబు, జెడ్సీ చైర్మన్లు గండ్ర జ్యోతి, సుధీర్ కుమార్, రాష్ట్ర షెడ్యూల కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, గోపి, శివ లింగయ్య, శశాంక, రూపేష్ మిశ్రా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.