చారకొండ, నవంబర్ 26: దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దళితుల సంక్షేమం గురించి నాడు అంబేద్కర్ ఆలోచిస్తే.. నేడు సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో దళితబంధు యూనిట్లను విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. దళితబంధు పథకం కోసం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నాలుగు మండలాల్లో చారకొండ ఉండటం సంతోషకరమన్నారు.
ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు అవుతుందన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 విడుతల వారీగా 65 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అం దించామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పన్నిన కుట్రను భగ్నం చేసిన హీరో గువ్వల బాలరాజు అని కొనియాడారు. దళితబంధును అమలు చేసిన సీఎం కేసీఆర్కు దళితజాతి జీవితాంతం రుణపడి ఉండాలన్నారు.