హైదరాబాద్ జూలై 6 (నమస్తే తెలంగాణ): వర్తమాన ప్రపంచంలోనైపుణ్యం ఉన్న వారికే ప్రపంచం రెడ్కార్పెట్ పరుస్తున్నది. ఇంజినీరింగ్ విద్యలోనూ నైపుణ్యతకు ప్రాధాన్యమిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్హెచ్ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్)ను అమలుచేయాలని నిర్ణయించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు ఏఐసీటీఈ వెల్లడించింది. డిప్లొమా ఫస్టియర్ను లెవల్ 3గా పేర్కొనగా, సెకండియర్ను లెవల్ 4గా, థర్డ్ ఇయర్ను లెవల్ 5గా వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్ కోర్సులను లెవల్-5 నుంచి 7 వరకు ప్రకటించారు.
అంతర్జాతీయంగా నైపుణ్యాలు, చదువులను లెవల్స్గానే వ్యవహరిస్తున్నారు. మన దగ్గరి ఇంటర్, డిప్లొమా కోర్సుల గురించి అంతర్జాతీయంగా చాలా మందికి తెలియదు. దీంతో మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్స్, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా లెవల్స్గా విభజించి అమలుచేస్తున్నారు. ఈ లెవల్స్ను అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్లినా వినియోగించుకోవచ్చని సాంకేతిక నిపుణులు తెలిపారు.