హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజాన కేంద్రంలో శనివారం తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహన రంగంపై ఆధారపడి బతుకుతున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేవారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, జీవన భృతి కింద నెలకు రూ.15వేలు ప్రభుత్వం అందించాలని కోరారు.
ఆటో మోటర్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆటో కార్మికులకు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఓలా, ఊబర్ సంస్థలను ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలని సూచించారు. యూనియన్ కార్యదర్శి చిన్నం బాల నర్సయ్య, రమేష్, రాష్ట్ర స్కూల్ వ్యాన్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్టీయూ ప్రెసిడెంట్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.