హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి సాయికుమార్ జైల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లను మాయం చేసే విద్యను నేర్చుకున్నాడు. 11 ఏండ్లుగా ఎఫ్డీల స్కాంలు చేసి రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసిన ముఠా.. అదే సమయంలో ఏపీలోనూ రెండు బ్యాంకుల నుంచి రూ.15 కోట్లు కొట్టేసినట్టు తాజాగా వెలుగుచూసింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్కు చెందిన రూ.5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బు ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి మళ్లించినట్టు విచారణలో బయటపడింది.
సాఫ్ట్వేర్ బూమ్ పోయి.. మోసాలు
అంబర్పేట్ ప్రాంతంలో ఉండే చందూరి వెంకట కోటి సాయికుమార్ 18 ఏండ్ల కిందట ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుచేశాడు. హైటెక్సిటీ, చెన్నైలో కార్యాలయాలు తెరిచాడు. 2002లో సాఫ్ట్వేర్ బూమ్ పడిపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. చెన్నైలోని ఎన్సీఎల్కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసేందుకు యత్నిస్తున్న ముఠా సభ్యులతో చేతులు కలిపాడు. విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని చెప్పిన ముఠా సభ్యులు.. చెన్నైలో సాయికుమార్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.6 కోట్లు డిపాజిట్ చేయించారు. ఇందుకు సాయికుమార్కు రూ.కోటి కమీషన్ ఇచ్చారు. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో ముఠాతోపాటు సాయికుమార్ను సీబీఐ అరెస్టు చేసింది. జైల్లో ఉండగానే సాయికుమార్ ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టే విధానాన్ని నేర్చుకున్నాడు. బయటకు వచ్చాక రియల్ ఎస్టేట్లోకి దిగాడు. అప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా తణుకువాసి వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. అతని ప్రింటింగ్ ప్రెస్కు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చేవి. ఆయా సంస్థల్లో అకౌంట్స్ విభాగం అధికారులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇద్దరు కలిసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తుండగా పద్మనాబన్ వీళ్లతో చేయి కలిపాడు. నకిలీ డిపాజిట్ బాండ్లు తయారు చేయడంలో పద్మనాబన్ దిట్ట. 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లు, 2015లో ఏపీ హౌసింగ్ బోర్డు ఎఫ్డీలు కాజేశారు. సాయికుమార్ 11 ఏండ్ల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం చేస్తుండగా.. అతనిపై 8 కేసులు ఉన్నట్టు సీసీఎస్ అధికారులు తెలిపారు.
చంచల్గూడ జైలుకు నిందితులు
అకాడమీ నిధులను కాజేసిన ముఠాలో ఇప్పటివరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సాయికుమార్ ప్రధాన సూత్రధారి కాగా, నందూరి వెంకటరమణ, పద్మనాబన్ ప్రధాన అనుచరులు. అరెస్టయిన తొమ్మిది మంది కస్టడీ మంగళవారం ముగియడంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు, కెనరా బ్యాంకు చందానగర్ బ్రాంచి మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సాయికుమార్ ఇచ్చిన రూ.1.99 కోట్లను ఎక్కడికి తరలించారనే విషయమై ఆరా తీస్తున్నారు. సాయికుమార్, అతడి అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ను దాఖలు చేశారు.