హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)కు డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు దక్కింది. ఈ నెల 21న ‘అగ్రికల్చర్ టుడే గ్రూపు’ ఈ అవార్డు ఇచ్చిందని ఎన్ఐఆర్డీపీఆర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
లక్షలాది మంది గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఈ అవార్డు లభించినట్టు పేర్కొన్నది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ సదాశివం ఈ జాతీయ అవార్డుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించినట్టు తెలిపింది. ఎన్ఐఆర్డీపీఆర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధీనంలోని ఓ ప్రధాన సంస్థ. ఆరు దశాబ్దాలుగా గ్రామాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తున్నది.