హయత్నగర్, డిసెంబర్ 9: ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ప్రొటోకాల్ అడ్వైజర్ ఆఫీసర్నంటూ నమ్మించి మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని తణుకు మండలం, అత్తిలి గ్రామానికి చెందిన బుసి ప్రవీణ్ సాయి (23) అనే ఆ వ్యక్తి నుంచి నకిలీ నంబర్ ప్లేట్ కలిగిన ఇన్నోవా క్రిస్టా కారుతోపాటు వెహికల్ సైరన్ సెట్, రెండు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, గుర్తింపు కార్డు, ప్రభుత్వ చిహ్నాలతో కూడిన నకిలీ స్టిక్కర్లు, హోం మంత్రి లెటర్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ భీమ్రెడ్డి వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. నిందితుడు అబ్దుల్లాపూర్మెట్ మండలం, గండిమైసమ్మ ఆలయ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని తక్కువ ధరలో రూ.25 లక్షలకు ఇప్పిస్తానంటూ బేగంపేట పెరల్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మల్లంపల్లి వీరభద్రరావు నుంచి రూ.8.10 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వీరభద్రరావు ఆ స్థలాన్ని సందర్శించగా.. అక్కడ నిర్మాణం జరుగుతున్నట్టు నోటీసు కనిపించింది.
ఆ చుట్టుపక్కల వారిని వాకబు చేయగా అది ప్రైవేట్ భూమి అని చెప్పారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పెద్దఅంబర్పేటలోని ఓఆర్ఆర్ సమీపంలో ప్రవీణ్ సాయిని అరెస్టు చేసి విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. అతనిపై ఇప్పటికే కూకట్పల్లి, సైఫాబాద్, ఏసీబీ హైదరాబాద్, బేగంపేట్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్టు ఏసీపీ భీమ్రెడ్డి తెలిపారు.