హైదరాబాద్ , జూన్26 (నమస్తే తెలంగాణ): తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బీటెక్ విద్యార్థినికి న్యాయవాదులు అండగా నిలిచారు. బకాయి ఫీజులు చెల్లించేందుకు ముందుకువచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నది.
ఐదో సెమిస్టర్ వరకు అన్ని ఫీజులు చెల్లించింది. గత నెల 12న తండ్రి మరణించడంతో విద్యార్థిని కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో తదుపరి సెమిస్టర్ ఫీజు చెల్లించలేకపోయింది. జూన్22న పరీక్షల రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి విద్యార్థిని పేరును కాలేజీ యాజమాన్యం తొలగించింది. ఫలితంగా తొలి ఇంటర్నల్ పరీక్ష రాయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫీజు బకాయి కారణంగా పరీక్షలకు అనుమతించడం లేదంటూ సదరు విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ను జస్టిస్ శ్రీదేవి విచారించారు. కాలేజీకి సుమారు రూ.60 వేల ఫీజు బకాయి ఉందని, అందులో రూ.20 వేలు మాత్రమే తాను చెల్లించగలనని విద్యార్థిని గోడు వెళ్లబోసుకున్నది. కోర్టులోనే ఉన్న సీనియర్ న్యాయవాదులు, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం, ఎస్ శ్రీరామ్, ఎల్ రవిచందర్ సదరు విద్యార్థిని దీనస్థితికి చలించిపోయారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలేజీకి మిగిలిన ఫీజును తాము చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో చేయూతనందించిన న్యాయవాదులను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ప్రత్యేకంగా అభినందించారు.