కేటీఆర్ చేతుల మీదుగా సభ్యత్వం
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్ రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. తెలంగాణభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటారు. ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో లాంఛనంగా చేరుతారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లేదా కరీంనగర్లో సభ నిర్వహించనున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఎల్ రమణ ఈనెల 7న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యా రు. ఆ మరుసటిరోజే రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నదని, ఈ ప్రగతి ప్రయాణంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని ఎల్ రమణ ప్రకటించారు.