కురుమూర్తి: పేదల తిరుపతి.. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Kurumurthy Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిలో జరిగే ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఉత్సవాలకు వేద పండితులు అంకురార్పన చేశారు. ఆవాహితదేవాతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, భైరీపూజ, ఉత్సవాంగ 108 అష్టోత్తర శతకలశాభిషేకం, స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి మయూర వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరలో భాగంగా బుధవారం నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈనెల 18న స్వామి వారి అలంకరణోత్సవం, 19న స్వామి ఉద్దాల ఉత్సవం ఉంటుంది.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. ఉద్దాల ఊరేగింపులో భాగంగా మొదట పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డ్డేమాన్ వరకు తీసుకొస్తారు. అక్కడే నియమ నిష్టలతో తయారు చేసిన స్వామి వారి పాదుకలు(ఉద్దాల)ను ఊరేగింపు ఉంటుంది. అందుకు భారీ బందోబస్తు ఆలయం వరకు కొనసాగుతుంది. ఉద్దాల ఉత్సవానికి ప్రజాప్రతినిధులతోపాటు లక్షల్లో భక్తులు తరలివస్తారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్, ఉన్నతాధికారులతో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సూచన మేరకు అధికారులు, పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవిని ఆడంబరంగా వివాహం చేసుకునేందుకు వేంకటేశ్వరస్వామి కుబేరుడితో అప్పు తీసుకుంటాడు. తీసుకున్న అప్పును తీర్చడంలో స్వామి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చెప్పిన కాలం గడిచిపోతుండడంతో కుబేరుడు అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో కలత చెందిన స్వామివారు ఓ రోజు అర్ధరాత్రి తిరుమలను వదిలి ఉత్తర దిశగా పయనమై నడుచుకుంటూ వస్తారు. జూరాల వద్ద గుండాల జలపాతం వద్ద నిండుగా ప్రవహిస్తున్న నదిని చూసి పరవశించిన స్వామివారు స్నానమాచరిస్తారు. అప్పటి వరకు తెల్లగా ప్రవహిస్తున్న నదిలో నీరు స్వామి వారి స్పర్శతో నీలం రంగులోకి మారుపోతుంది. ఆ రంగును చూసిన స్వామి వారు కృష్ణా అంటూ నదిని సంభోదిస్తారు. ఆయన పిలుపుతో కృష్ణమ్మ ప్రత్యక్షమై కాలినడకతో వస్తున్న స్వామివారు పాదాలు కందిపోకుండా పాదుకలను బహూకరిస్తుంది.
అందుకే కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఉత్సవంగా నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరిన స్వామివారు నిర్మానుష్యంగా, నిర్మలమైన ప్రశాంతంగా ఉన్న కురుమూర్తి కొండల్లో ఉన్న కాంచన గుహలో సేదతీరేందుకు నిలిచిపోతాడు. స్వామి వారు లేరన్న బెంగతో పద్మావతిదేవి జాడ వెతుక్కుంటూ కురుమూర్తి కొండలకు చేరుకుంటుంది. స్వామి వారిని తన వెంట తిరుమలకు రావాలని ప్రాదేయపడడంతో కాదనలేక, తనకు ఇష్టమైన కురుమూర్తి కొండలను వదిలి వెళ్లలేక తన ప్రతిరూపంతోపాటు, పద్మావతిదేవి ప్రతి రూపాలను ఆ కాంచన గుహలోనే వదిలి వెళ్తారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తులకు స్వామివారు దర్శనమిస్తూ వారి కోరికలను తీర్చడం ద్వారా భక్తులు ఇష్టంగా ఇచ్చే కానుకలతో కుబేరుడి అప్పు తీరుస్తున్నట్లు భక్తుల నమ్మకం.