అబిడ్స్, మే 20: మరో కులోన్మాద హత్య.. తమ ఆడబిడ్డను ప్రేమ పెండ్లి చేసుకొన్నందుకు పగతో చేసిన ఘాతుకం.. రాడ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపిన అమానుషం.. ఈ దారుణానికి హైదరాబాద్లోని బేగంబజార్ చేపల మార్కెట్ సాక్ష్యంగా నిలిచింది. గోషామహల్ ఏసీపీ సతీశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్లోని కోల్సావాడి ప్రాంతంలో నివాసముండే రాజేందర్ పన్వార్ స్థానికంగా పల్లీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని కుమారుడు నీరజ్ పన్వార్(21) అదే ప్రాంతానికి చెందిన సంజనను ఏడాదిన్నర కిందట ప్రేమించి పెండ్లి చేసుకొన్నాడు. వారికి రెండు నెలల బాబు ఉన్నాడు. పెండ్లి అయినప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నీరజ్ పన్వార్ బేగంబజార్ చేపల మార్కెట్ ప్రాంతంలో తన బంధువు దుకాణానికి తాతతో కలిసి వెళ్లివస్తుండగా.. ఐదుగురు దుండగులు అతని బైక్ను అడ్డుకొని దాడికి దిగారు. వెంబడించి విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నీరజ్ను ఉస్మానియా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సంజన తరఫు బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నీరజ్ తండ్రి మాట్లాడుతూ.. ప్రేమ పెండ్లి చేసుకొన్నందుకు కక్షతో తన కోడలి తరఫు బంధువులే హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, హత్య జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది.