KTR Warangal Tour | వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 6న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. సభలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను కేటీఆర్ చేతులమీదుగా అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమన్వయంతో మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు.
హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, బల్దియా కమిషనర్ షేక్ రిజవ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడేతో సమావేశం నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా వరంగల్కు చేరుకొని.. ఎంజీఎం సమీపంలోని పోలీస్ భరోసా కేంద్రం ప్రారంభోత్సవం చేయనున్నారన్నారు.
స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ, ఐటీ టవర్స్, ఆరు జంక్షన్స్ తదితర పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ మేరకు రూట్మ్యాప్ సిద్ధం చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59, 76 తదితర వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులకు సీటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు
కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.