హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తైవాన్ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను కోరుకొంటున్నామని చెప్పారు. తైవాన్లోని ఎలక్ట్రానిక్ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తే స్వాగతిస్తామన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం తైవాన్-కనెక్ట్ తెలంగాణ స్టేట్ పేరుతో జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ మా ట్లాడుతూ.. తైవాన్, తెలంగాణ మధ్య వ్యాపార, వాణిజ్యాలను మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ముందు నుంచి తైవాన్ వ్యాపారుల పెట్టుబడులకు అత్యం త ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్తూ.. ఇందుకోసమే తాను గతంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. తైవాన్కు చెందిన టీసీఏ (తైవాన్ కంప్యూటర్ అసోసియేషన్)తో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకొన్నామని కూడా తెలిపారు. ఇండియన్ తైవాన్ స్టార్టప్ అలయెన్స్ను ఏర్పాటు చేసుకొన్న ఏకైక భారత నగరం హైదరాబాద్ అని చెప్పారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని, ఈ దిశగా అక్కడి పారిశ్రామికవర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తంచేశారు. గత ఐదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తున్నదని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తున్నదని తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తూ వస్తున్నదన్నారు. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, పరిశోధన-అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయ త్నం చేస్తున్నదని.. ఈ దిశగా తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలు తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే తైవాన్కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, దాని అనుబంధ రంగాల్లో తైవాన్తో బలమైన భాగస్వామ్యం కుదుర్చుకొనేందుకు కృషి చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ విధానాలు, రాష్ట్రం సాధిస్తున్న పురోగతిపై ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా ప్రశంసలు కురిపించారు. ఇన్వెస్ట్ ఇండియా తరఫున తెలంగాణతో కలిసి పనిచేయడం తమకు ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు. తెలంగాణ తైవా న్ దేశానికి సహజ భాగస్వామి అని తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువాంగ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తాము అద్భుత భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. ఇప్పటికే తైవాన్కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణతో భాగస్వామ్యా న్ని కలిగి ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి తదితరులు పాల్గొన్నారు.