హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్లో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ను ఈ నెల 14న మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సుమారు రూ.100 కోట్లతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించామని చెప్పారు.
ఆచార్య నాగార్జునుడు రెండు వేల సంవత్సరాల కిందట నడియాడిన ప్రదేశంగా, ఆయన స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, బౌద్ధమత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం (బోధిసత్వ పార్), ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిటీ, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించామన్నారు. తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.