హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్గూడలో నిర్మిస్తున్నట్టు మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. ట్విట్టర్లో ప్రేమ్ అనే నెటిజన్ ‘మన హైదరాబాద్లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా అద్భుతమైన సరస్సు కింద ఇది సాధ్యం కాదా?
దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియాన్ని బహుమతిగా ఇవ్వండి. సార్ దయచేసి ఆలోచించండి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద అక్వేరియం నిర్మాణం కొత్వాల్గూడలో ప్రారంభమైందని తెలిపారు. కొత్వాల్గూడలో సుమా రు 85 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎకో పార్కు, అందులోనే దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ కేంద్రం వివరాలను, వాటి ఫొటోలను షేర్ చేయాలని పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ అధికారులకు మంత్రి సూచించారు.