హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఐటీ పరిశ్రమల్లో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ, సంచుల కొద్దీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనేందుకు, ఢిల్లీ బాసులకు డబ్బుల మూటలు పంపడానికి ఇవేమీ అవసరం లేదు’ అని ఎద్దేవాచేశారు. తనను ఒక ఐటీ ఉద్యోగి అని మాట్లాడిన వారికి ఆయన ధీటైన సమాధానం చెప్పారు.
ఈ మేరకు గురువారం ఎక్స్వేదికగా ఆయన స్పందించారు. ‘నన్ను ఒక ఐటీ ఉద్యోగి అని మాట్లాడొచ్చని అనుకునేవాళ్లకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ, ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడుతూ జీవనోపాధి పొందుతున్నారు.
ఐటీ, అనుబంధ సంస్థల్లో ఉన్న నా అకాచెల్లెండ్లకు, అన్నదమ్ములకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నం. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని స్పష్టం చేశారు.