హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవోలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు పరీక్షల విభాగం కఠిన నిర్ణయం తీసుకొన్నదని, దీనిని అమలు చేయాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన డీఈవోలకు అదనపు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు 5,08,385 ( బాలురు 2,57,952, బాలికలు 2,50,433 ) మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 2,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
విద్యార్థులకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని చెప్పారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు ఇన్విజిలేటర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాపీయింగ్ పట్టుబడిన విద్యార్థులు పరీక్షల నుంచి డిబార్ అవుతారని, అదే సమయంలో ఉపాధ్యాయులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకొని, ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించాలని సూచించారు. పరీక్షల సమయంలో సమాచారం, ఫిర్యాదులకు 040-23230942 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.