హైదారాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. సోమవారం శాసనసభలో మైనార్టీల సంక్షేమంపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో ఒక్క మతకల్లోలం కూడా జరుగలేదని తెలిపారు. ఉర్దూను రెండోభాషగా అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, మైనార్టీల సంక్షేమానికి ఏటా బడ్జెట్ పెంచుతున్నట్టు వివరించారు.
గత ప్రభుత్వాలు 10 ఏండ్లలో ముస్లిం, ఇతర మైనార్టీల కోసం రూ.2,744 కోట్లు ఖర్చుచేస్తే.. ఏడేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,644.26 ఖర్చు చేసినట్టు తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంతో 1,90,820 మంది మైనార్టీలు లబ్ధిపొందినట్టు తెలిపారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా 204 గురుకులాలు ఏర్పా టు చేశామని, రూ.155 కోట్లు రుణాలు అందించినట్టు చెప్పారు. రూ.8.48 కోట్లతో మక్కా మసీదు అభివృద్ధి పనులు చేపట్టినట్టు, క్రిస్టియన్భవన్ కోసం కోకాపేటలో 2 ఎకరాలు, రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణ ఇస్లామిక్ కల్చలర్ సెంటర్ నిర్మాణానికి రూ.32 కోట్లు కేటాయించామన్నారు.
తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ సవరణ బిల్లుకు ఆమోదం
తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ తరపున పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.